ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనే అంశాన్ని మనం ఇప్పటికే తెలుసుకున్నాం. పొదుపు చేయడం ఎంత ముఖ్యమో.. పొదుపు చేసిన దాన్ని మెరుగైన పెట్టుబడి సాధనంలో ఇన్వెస్ట్ చేయడం కూడా అంత కంటే ఎక్కువ ముఖ్యం. ఊరికే సేవింగ్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాల్లోనో, గోల్డులోనో, ఫిక్సెడ్ డిపాజిట్ చేసి కూర్చుంటే మాత్రం ప్రయోజనం లేదు. మన రిటైర్మెంట్ లక్ష్యాలో.. లేక ఇతర అంచనాలు తారుమారయ్యే అవకాశం ఉంది. అందుకే సేవింగ్స్తో పాటు సేవ్ చేసిన దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది కూడా అత్యంత ముఖ్యమైన అంశమని మాత్రం మర్చిపోవద్దు.
ఈ నేపధ్యంలో వివిధ పెట్టుబడి సాధనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన వయస్సెంత, ఎంత పొదుపు చేయాలి, ఎంత కాలం చేయాలి, మనకు ఉన్న లక్ష్యాలు ఏంటి, వాటిని చేరుకోవాలంటే ఎంత రిటర్న్స్ రావాలి, రిస్క్ ఎంత తీసుకోగలం వంటి అంశాలన్నింటినీ మనం బేరీజు వేయాల్సి ఉంటుంది కాబట్టి కాస్త శ్రద్ధ వహించండి.
ముఖ్యంగా పెట్టుబడి సాధనాలను నాలుగు భాగాలుగా విభజిద్దాం. వాటిల్లో..
1. ఫిక్సెడ్ ఇన్వెస్ట్మెంట్
2. ఈక్విటీ మార్కెట్స్ (స్టాక్ మార్కెట్లు)
3. రియల్ ఎస్టేట్
4. కమోడిటీస్ (బంగారం, వెండి)
ఫిక్సెడ్ ఇన్వెస్ట్మెంట్స్
ఇవి కాస్త రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్స్. అంటే నష్టభయం కాస్త తక్కువగా ఉంటుంది. పెట్టుబడిగా కొంత మొత్తం పెట్టిన తర్వాత మనకు క్రమానుగతంగా వడ్డీల రూపంలో అందుతూ ఉంటుంది. సాధనాన్ని బట్టి నెలకు, త్రైమాసికానికి లేదా వార్షికానికి ఒకసారి మనకు సొమ్ము లభిస్తుంది. కాలపరిమితి ముగిసిన తర్వాత మనం ఎంచుకున్న దాన్ని వడ్డీతో సహా లేకపోతే అసలును చెల్లిస్తారు.
ఇందులో ముఖ్యంగా
1. బ్యాంకుల ఫిక్సెడ్ డిపాజిట్లు
2. కేంద్ర ప్రభుత్వం జారీ చేసే బాండ్లు
3 . ప్రభుత్వ సంస్థలైన హడ్కో, హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, ఆర్ఈసీ వంటి సంస్థలు జారీ చేసే బాండ్లు
4. కార్పొరేట్ సంస్థలు జారీ చేసే బాండ్లు
ఇప్పుడున్న పరిస్థితుల్లో వీటిపై వడ్డీ 8-9 శాతం వరకూ ఏటా లభిస్తోంది. కొన్ని రిస్కీ కార్పొరేట్ బాండ్స్ 10 శాతం వరకూ ఇస్తున్నాయి.
ఈక్విటీ
ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడులంటే పబ్లిక్గా లిస్ట్ అయిన సంస్థల్లో పెట్టుబడులు పెట్టడమే. ఈ షేర్ల అమ్మకాలు, కొనుగోళ్లను మనం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో చేస్తాం.
అయితే ఇందులో వందకి వంద శాతం రిస్క్ తప్పకుండా ఉంటుంది. ఇతర ఫిక్సెడ్ సాధనాల్లో మాదిరి క్యాపిటల్కు ఎలాంటి గ్యారెంటీ లేదు. అయితే ఈక్విటీల్లో 14-15 శాతానికి తక్కువ లేకుండా రాబడి వచ్చిన సందర్భాలు అత్యధికం. గత పదిహేనేళ్లలో సరాసరి తీసుకుంటే (వార్షిక వృద్ధి రేటు) 15 శాతానికి తక్కువ లేకుండా ఉంది.
మంచి స్టాక్స్ను ఎంపిక చేసుకుని వాటిలో దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేస్తే 20 శాతానికి పైగానే లాభాలను ఇచ్చిన సందర్భాలున్నాయి.
అయితే ఇలాంటి స్టాక్స్ను ఎంపిక చేసుకునేందుకు మనకు నైపుణ్యం, ఓపిక కావాలి.
2018 ఏప్రిల్ నుంచి వీటి ద్వారా వచ్చే ఆదాయంపై పన్నును విధిస్తోంది కేంద్రం. ఏడాది కంటే
ఎక్కువ రోజులు ఉంచుకున్న స్టాక్ ద్వారా మనకు ఆదాయం లభిస్తే.. దానిపై 1 0 శాతం క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అయితే ఇతర పెట్టుబడి సాధనాలతో పోల్చి చూసినా కూడా పన్ను శాతం తక్కువనే చెప్పొచ్చు.
రియల్ ఎస్టేట్
భూముల కొనుగోలు - అమ్మకాన్ని రియల్ ఎస్టేట్గా పరిగణిస్తాం. భూమిని నమ్ముకున్నోడు ఎప్పుడైనా బాగుపడ్తాడు అనే పూర్వపు రోజుల్లో పెద్దలు చెప్పేవారు. అయితే అప్పట్లో భూమి లభ్యత ఎక్కువగా ఉండేది, జనాభా తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయి. భూమి దొరకడం కష్టమవుతోంటే, దీనిపై పెట్టుబడులు పెట్టే వాళ్ల సంఖ్య నానాటికీ అధికమవుతోంది. వ్యవసాయ భూమి నుంచి కమర్షియల్ ప్రాపర్టీ వరకూ ప్రతీదీ ఇప్పుడు పెద్ద వ్యాపారమే.
ఇందులో ముఖ్యంగా ఫ్లాట్, ప్లాట్స్ అమ్మి, కొనడం ఒక పద్ధతి. రెండోది రెంటల్ ఇన్కం. అంటే బాడుగ ద్వారా వచ్చే మొత్తం. దీనికి తోడు క్యాపిటల్ అప్రిషియేషన్ కూడా ఉంటుంది. అంటే భూముల విలువ పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఆస్తి విలువ కూడా పెరుగుతుంది.
అయితే ఇది కూడా పూర్తి నైపుణ్యంతో కూడిన పని. భూమి డాక్యుమెంట్లు, లీగల్ వ్యవహారాలు, దాని పరిరక్షణ వంటివి జాగ్రత్తగా తీసుకోవాలి. ఇది పెద్ద మొత్తాలతో కూడుకున్న వ్యవహారం. లక్షలకు లక్షలు పోసి దిగాలి. లాభాలు వస్తే తిరుగేలేదు, అయితే ఏదైనా కారణాలతో ఇరుక్కుపోయామంటే అసలు కూడా ఇరుక్కుపోయే ప్రమాదం ఇందులో బాగా ఎక్కువ. కానీ అధికారికంగా ఇప్పటివరకూ ఈ రంగంలో లాభాలను బేరీజు వేయడానికి, లెక్కలు కట్టడానికి స్పష్టమైన వ్యవస్థ లేదు. ఈ మధ్య రీసెర్చ్ కంపెనీలు పుట్టుకొస్తున్నా వాళ్లంతా కమర్షియల్ ప్రాపర్టీల రేట్లు పెరుగుదల, క్షీణతపైనే ఎక్కువగా దృష్టిపెడ్తారు.
కమాడిటీస్ - బులియన్ మార్కెట్
బంగారానికీ - భారతీయులకూ మధ్య విడదీయరాని బంధం ఉంది. కటిక పేదవాళ్లైనా కాసు బంగారం ఉండాలని తాపత్రయ పడ్తారు. ఎందుకంటే దీని విలువ ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుందని, ఇది లిక్విడ్ క్యాష్తో సమానమేది మనందరి భావన. అందుకే వివిధ దేశాలు బ్యాంకులు గోల్డును హెడ్జింగ్ కోసం నిల్వచేసుకుంటాయి.
ఇక ఈ బులియన్లో మనం ముఖ్యంగా బంగారం, వెండిపై పెట్టుబడులు పెట్టడం చూస్తున్నాం. గత ఇరవై ఏళ్ల కాలంలో ఇవి ఎనిమిది శాతం వరకూ వార్షిక సగటు రాబడిని అందించాయి. అయితే మనలో చాలా మంది చేసే తప్పు ఏంటంటే.. బంగారంలో పెట్టుబడి అంటే జ్యువెల్రీని కొంటారు. ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే వేస్టేజీ కింద 15-20 శాతం పోతుంది. మళ్లీ అమ్మాలనుకున్నప్పుడు మరో 10 శాతం వరకూ కోత విధిస్తారు. ఈ లెక్కన మనం అమ్మాలనుకున్నప్పుడు వచ్చే ఆదాయం తక్కువే (ఒకవేళ భీభత్సంగా గోల్డ్ రేట్ పెరిగితే తప్ప...). అందుకే ఈటీఎఫ్స్, గోల్డ్ బాండ్స్ వంటి వాటిల్లో పెట్టుబడులు పెడితేనే మనకు ఉపయుక్తంగా ఉంటుంది.
ఏది బెస్ట్
మనం ఇప్పటి వరకూ ఫిక్సెడ్ డిపాజిట్లు, ఈక్విటీలు, కమాడిటీస్ గురించి తెలుసుకున్నాం. ఇందులో మొదట చెప్పుకున్నట్టు ఓ వ్యక్తి దగ్గర నెలకు మిగిలిన రూ.20 వేలను ఇప్పుడు పైన చెప్పిన వివిధ అసెట్ క్లాసెస్లో 20 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే ఎంత మొత్తం వచ్చిందో చూద్దాం.
1. మొదటగా 9 శాతం వడ్డీతో (ఇప్పుడు 5-6 శాతం వస్తేనే ఎక్కువ) నెలకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి పెడితే మనకు ఆఖర్లో వచ్చే మొత్తంరూ.3.3 కోట్లు
2. అదే మొత్తాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తే.. (15 శాతం రాబడిని ఆశిద్దాం ఇక్కడ) మనకు వచ్చే కార్పస్ రూ.5.4 కోట్లు
3. ఇక అదే మొత్తాన్ని కమాడిటీస్లో ఇన్వెస్ట్ చేస్తే 8 శాతం రిటర్న్స్ చొప్పున లెక్కిస్తే.. చివర్లో మన చేతికి అందే మొత్తం రూ.3.09 కోట్లు.
4. ఇక్కడ నెలవారీ ఆదాయం కాబట్టి రియల్ ఎస్టేట్ పెట్టుబడిని మనం పరిగణలోకి తీసుకోలేదు.
దీన్ని బట్టి మనం పైన చూసిన నాలుగు పెట్టుబడి మార్గాల్లో.. ఈక్విటీ మార్కెట్స్ క్లియర్ లీడర్గా కనిపిస్తున్నాయి. దీర్ఘకాల పెట్టుబడి ఆలోచన ఉన్నవాళ్లకు ఈక్విటీ మార్కెట్స్ ఓ మంచి వెల్త్ క్రియేటింగ్ టూల్గా ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహమూ లేదు.
అయితే అంతా ఈక్విటీల్లోనే కుమ్మరించేద్దామా
ఎక్కువ లాభాలు వస్తున్నాయి కదా అని డబ్బంతా ఒక్క అసెట్ క్లాస్లోనే కుమ్మరించినా కూడా నష్టాలు తప్పవు. అందుకే డైవర్సిఫికేషన్ చాలా ముఖ్యం. దీన్ని అసెట్ అలొకేషన్ అంటారు. ముఖ్యంగా యుక్త వయస్సులో ఉన్నప్పుడు మనం అధిక శాతం పెట్టుబడులను ఈక్విటీల్లోకి మళ్లించవచ్చు. ఎందుకంటే దీర్ఘకాలం ఉంచుతాం కాబట్టి ఎక్కువ రాబడి వస్తుంది. దీనికి ఓ చిన్న సూత్రం ఉంది. మన వయస్సు 25 ఏళ్లు అనుకుంటే.. (100 మైనస్ మన వయస్సు) 75 శాతాన్ని ఈక్విటీల్లో పెట్టొచ్చు. అదే వయస్సు పెరిగే కొద్దీ ఈక్విటీల నుంచి కొద్దిగా తగ్గించి డెట్ ఫండ్స్ వైపు (కాస్త రిస్క్ తక్కువ ఉన్న ఫండ్స్) మార్చుకోవాలి. మన వయస్సు 40 ఏళ్లంటే.. 60 శాతం మాత్రమే ఈక్విటీల్లో పెట్టడం మంచిది. అదే సమయంలో అలానే ఒక ఐదు నుంచి పదిశాతాన్ని గోల్డులో పెట్టుబడులకు వినియోగించవచ్చు. ఇలా నిధులను మళ్లించుకుంటే.. ఒక దాంట్లో తేడా వచ్చినా మిగిలినది కాస్త ఆదుకుంటుంది.
చివరగా చెప్పొచ్చేది ఏంటంటే..
1. రిస్క్ ఉంటేనే రివార్డ్ ఉంటుంది. రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా లేకపోతే ఎక్కువ లాభాలను ఆశించవద్దు. అలా అని క్యాపిటల్ కూడా పోయేంత రిస్క్ మాత్రం తీసుకోవద్దు
2. పూర్తిగా ఫిక్సెడ్ డిపాజిట్లు, సేవింగ్స్ డిపాజిట్లపైనే ఆధారపడొద్దు.
3. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొని లాభాలను ఇవ్వడంతో ఈక్విటీలకు మంచి చరిత్రే ఉంది. సుమారు 14-15 శాతానికి రాబడిని అందిస్తూ వచ్చాయి.
4. రియల్ ఎస్టేట్ మంచి పెట్టుబడి సాధనమే కానీ అందుకు భారీ మొత్తంలో నిధులు అవసరమవుతాయి.
5. గోల్డ్ మంచి రిటర్న్స్ ఇస్తోంది కానీ.. పూర్తిగా దానిపైనే నిధులు కుమ్మరించవద్దు. పెట్టుబడులను డైవర్సిఫై చేసుకుంటేనే మంచిది.
- నాగేంద్ర సాయి
(జెరోధా వర్సిటీ సహకారంతో)